Thursday 12 July 2012

పసిడి జింక

12.07.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో   
"పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన చిత్రమునకు 
వ్రాసిన పద్య వ్యాఖ్య

 పసిడి జింక
సీ.
రంగారు వర్ణాల రమ్యమై వెలుగొందు
          సుందర హరిణమ్ముఁ జూడు డార్య!
బంగారుమేనుతో సింగారములు నిండి
          యిందు నందును వేగ మేగుచుండె
చంచలాక్షులతోడ సయ్యాటలాడుచు
          నందకుండగ దూర మరుగుచుండె
ఎట్టులైనను దీనిఁ బట్టుకోవలెనంచు
          మానసంబున వాంఛలూనుచుండె
కోరబోవను వేలాది కోర్కెలెపుడు
జగతి ననుపమమైన యీ మృగము నిపుడు
రయమునను దెచ్చి నా మనోరథము దీర్చ
గోరుచుంటిని మిమునాథ! కూర్మిమీర.
మ.
మునుపేనాడును జూడలేదు మిగులన్ 
                                 మోదంబు నందించుచున్
వనభూమిన్ దిరుగాడుచున్నది మహ
                                  ద్భాగ్యంబు నేడీ మృగం
బినవంశోద్భవు డందజేసినను నా
                                  కెంతేని చేకూరు తా
ననుచున్ జానకి కాంక్ష చేసినది 
                                   దివ్యానందసంపూర్ణయై.
సీ.
అసురు లెవ్వారలో కసితోడ నీరీతి
          మాయను కల్పించి మనకు నిట్లు
భ్రమగల్గునట్లుగా పసిడిజింకను జేసి
          యుందురు గాని వేరొండు గాదు
దీనినందుటయన్న హాని పొందుటె గాదె
          నామాట నమ్ముము రామచంద్ర!
దనుజుల కృత్యాలు మనమెరుగనట్టివా
          కోరుచు నద్దాని జేరు కొరకు
యత్న మొనరింప వద్దంచు నగ్రజునకు
చెప్పి వారింప జూచిన నప్పుడతడు
లక్ష్మణా! విను జానకీ రమణి కొరకు
సంత సంబున నేగి సాధింతు నిదిగొ. 
తే.గీ.
ఇట్టె కొనివచ్చి యద్దాని నింపుమీర
హర్షమొదవంగ సీతకు నందజేతు
నసురుడైనచొ వానిని యముని కడకు
పంపె దనటంచు రాముడు పలికె నపుడు.

No comments:

Post a Comment