Wednesday 4 July 2012

భగత్ సింహ్

ది. 04.07.2012 వ తేదీ 
"శంకరాభరణం" బ్లాగులో 
"పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి 
వ్రాసిన పద్యవ్యాఖ్య
 

 భగత్ సింహ్
శా.
స్వాతంత్ర్యోద్యమమందు దేశమునకున్ 
                                      భక్తాగ్రగణ్యుండుగా
నేతృత్వంబు వహించి మ్లేచ్ఛకృతముల్ 
                                      నిందించి దేశీయులం
దాతండందరికిందు ధైర్యవిభవం 
                                      బందించె, వీరుండుగా
ఖ్యాతింబొందిన భక్తసింహునకు 
                                      నేనర్పింతు జోహారులన్.
ఆ.వె.
భగతసింహ! వీర! భారతావనియందు
స్వేచ్ఛ నందజేసి సిరులు బంచు
కొరకు నీవు చేయు నిరతయత్నముఁ జూ  డ
నిరుపమాన మౌర! నీకు నతులు.
 
ఆ.వె.
దేశహితముఁ గోరి ధీరత్వమును బూని
యుద్యమించి ముందు కురికి తుదకు
పరమభాగ్య మనుచు ప్రాణంబులనుసైత
మర్పణంబు చేతు వనఘ! నీవు. 

 ఆ.వె.
నిష్ఠ బూని చేయు నీబలిదానంబు
మరువరాని దెపుడు మహితచరిత!
సతము భరతభువిని సంస్మరణీయమై
ప్రణతులందుచుండు భగతసింహ!
 
ఆ.వె.
భారతీయులౌచు స్వాతంత్ర్యజీవన
వరము నంది యున్న వారి కెల్ల
నీదు దివ్యచరిత మాదర్శ మైయొప్పు
వందనంబు లయ్య! భగతసింహ!
 

No comments:

Post a Comment