Tuesday 3 July 2012

వ్యవస్థ మారేనా

ది. 02.07.2012 వ తేదీ 
"శంకరాభరణం" బ్లాగులో 
"పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి 
వ్రాసిన పద్యవ్యాఖ్య
 
సీ.
సౌధరాజమునందు సౌఖ్యంబులనుగాంచి
          వైభవంబులఁ దేలు వారలొకరు
పూరిగుడిసెలోన భోజనంబునకైన
          భాగ్యమందని పేదవారలొకరు
పిత్రార్జితంబైన విత్తంబు చేకొని
          నిరతసంతోషులౌ సరసులొకరు
పిన్న పెద్దలటంచు భేదమించుకలేక
          సభ్యులందరు గూడి సర్వగతుల
నెండ వానలు చూడక నెల్లవేళ
లందు కష్టంబునకునోర్చి యన్ని పనులు
చిన్మయానందమూర్తులై చేయుచుండు
వారలొకకొంద రరయంగ భారతమున.
చం.
అరువదియైదు వత్సరములద్భుతరీతి గతించిపోయె నీ
భరతభువిన్ స్వకీయపరిపాలనమంది, స్వతంత్రభారతిన్
సరియగు నార్థికోన్నతుల ఛాయలు పేదలజీవితాలలో
నరయగ లేము, కారణము లందరికిన్ విదితంబులే గదా!
తే.గీ.
విద్య నేర్వంగ వలసిన వేళలోన
బాలికలు సైత మింతటి భారమైన
పనులు చేయుట కటకటా! భావ్యమగునె?
తమకుటుంబము పోషించ దలచి యౌర!
తే.గీ.
ఆటపాటలలో కాల మందమొప్ప
గడుపగలయట్టి భాగ్యంబు కానరాదు
కఠినతరమైన దారిద్ర్య కారణమున
బాలికలకైన నీరీతి భరతభువిని.
తే.గీ.
సమత చేకూర గలుగునా సంఘమందు
నార్థికాభ్యుదయముగల్గి యందరకును,
బాల కార్మికసరణులీ భారతమున
నంతరించునె? సౌఖ్యంబు లందగలవె?

No comments:

Post a Comment