Monday 9 July 2012

క్షత్రియధర్మం

09.07.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో   
"పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన చిత్రమునకు 
వ్రాసిన పద్య వ్యాఖ్య
 
 క్షత్రియధర్మం
లోకహితమును గోరుచు నేకదీక్ష
యజ్ఞయాగాది క్రతువుల ననవరతము
చేయు చుండెడి సన్మునిశ్రేష్ఠులకును
విఘ్నములు గూర్తు రసురులు వివిధగతుల.

దుష్టులను గూల్చి యణగించి దుర్మతులను
ధర్మరక్షణ చేయుచు ధైర్యమొసగి
సాధుజనులను గాచుట క్షత్రియులకు
విహితధర్మంబు చూడగ విశ్వమందు.

గాధినందను డొనరించు క్రతువు నపుడు
భంగ మొనరింప బూనిన పరమనీచు
లైన రక్కసిమూకను యముని పురికి
రామ చంద్రుండు పంపించె రయము మీర.

అతివనైనను దుర్మతి యగుచు మీరి
సజ్జనాళిని బాధించి సవనములకుఁ
గీడు కలిగింపఁ బూనిన నాడు దానిఁ
జంప దగునిందు లేదింత సందియంబు.

No comments:

Post a Comment