Tuesday 26 June 2012

అంపశయ్య

ది. 26.06.2012 వ తేదీ "శంకరాభరణం" బ్లాగులో "పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి వ్రాసిన పద్యవ్యాఖ్య.
 
అంపశయ్య
చం.
శరముల శయ్యపై పడిన శంతనుపుత్రుడు దాహపీడతో
నరయగ నీటికోసమపు డర్జును డాదర మొప్పగా వడిన్
వరమగు బాణయోగమున భవ్యములౌ క్షితిగర్భనీరముల్
ధరణికిఁ దెచ్చె నందరును ధన్యుడటంచుఁ దలంచ ఖేచరుల్.
     ఆ.వె.
          సవ్యసాచి మరియు సాక్షాత్తు విష్ణువౌ
          చక్రధరుని ప్రాణసఖుడె గాక
          సత్యదీపితుండు శక్తియుక్తుండౌట
          జగతిలో నతని కసాధ్యమేది?
     ఆ.వె.
          పరవశించి యంత వాత్సల్యపూర్ణుడై
          పిలిచి చేరదీసి భీష్ము డెంతొ
          తుష్టి చెంది యొసగె నిష్టార్థసిద్ధికై
          ఆశిషంబు లప్పు డర్జునునకు.
     ఆ.వె.
          వృద్ధజనుల సేవ శ్రద్ధతో జేసిన
          వారి కబ్బు సకల వైభవములు
          విజయసిద్ధి గలిగి విజ్ఞత చేకూరు
          సందియంబు లేదికెందుఁ జూడ.

No comments:

Post a Comment