ది.10.05.2012 వ తేదీ
"శంకరాభరణం" బ్లాగులో
"పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి వ్రాసిన
పద్యవ్యాఖ్య
మోహిని
సీ.
తొల్లి మత్స్యంబౌచు ఎల్లవేదంబులన్
కాపాడి యున్నట్టి ఘనుడతండు,
సకల సురాసురుల్ సాగరంబున జేరి
అమృతంబు కాంక్షించి యందులోన
మంథరాద్రిని నిల్పి మహిమాన్వితుండైన
వాసుకిన్ త్రాడుగా చేసినపుడు
కూర్మరూపంబుతో కోరనచ్చట జేరి
గిరిని దాల్చిన యట్టి సురవరుండు
తే.గీ.
సిరిని చేపట్టి యలరించు సరసుడగుచు
దానవారులు ప్రార్థింప దయను జూపి
అమృత మందింతు వీక్షింపు డని యటంచు
సౌరులొలికించు నతివగా మారెనపుడు.
కం.
మోహినియై చూపరులకు
మోహంబును గల్గజేసి మురహరు డనఘుం
డాహరి యమృతపు భాండం
బాహా! యరచేత బూని యచ్చట నిలిచెన్.
కం.
జేజే మోహనరూపా!
జేజే కమలాయతాక్ష! జేజే శార్ఙీ!
జేజే యసుర నిహంతా!
జేజే భువనైకనాథ! జేజేలు హరీ!
కం.
హరి! నీనామము దలచిన
హరియించును పాపచయము లానందమగున్.
"హరిహరిహరి" యని యందును
కరుణను జూపించి మమ్ము గావు మనంతా!
No comments:
Post a Comment