Monday 7 May 2012

పిలుపు


ఉ.
భారత భావిపౌరులగు బాలకులార! యనన్య సాధ్యమౌ
కారణజన్మ మీ భరత ఖండమునందు లభించె గావునన్
ధీరత నీ ధరాస్థలిని దీవ్యదనంత సుఖప్రదంబుగా
గూరిచి గావ బూనుడిక కూర్మిని నేటి సభాముఖంబుగన్. 
ఉ. 
వేదచతుష్టయంబులవి విశ్వవిభూతికి కారణంబు లీ
మేదినిలో జనించినవి, మించు యశంబుల గూర్చు శాస్త్రముల్
మోదము నందగా నిచట మున్ను భవంబును బొందియుండె న
య్యాదిమ మౌని వర్గమిక నందిరి జన్మము భారతావనిన్.
ఉ.
వానిది భాగ్యవైభవము, వానిది సార్థక జీవనం బికె
వ్వాని హృదంతరంబిలను భారత మాతృక శాంతి దుగ్ధముల్
పానము చేసి, తన్మయత భారతి విస్ఫుట సాధుగీతికల్
గానముజేసి ధన్యతను గాంచునొ  వాడు మునీంద్ర తుల్యుడౌ.
ఉ.
ఇట్టు(ట్టి) విశిష్టమై వెలుగు నీ భరతావనిలో గనంగ నే
పట్టున జూచినన్ మతము, భాగ్యవిహీనత, దౌష్ట్యవర్ధనల్
బిట్టుగ నుగ్రవాదములు, భిన్నత బెంచెడి ప్రాంత భేదముల్
ముట్టడి జేసి దేశమును ముక్కలు చేయగ బూనె హా విధీ!
ఉ.
రండు ప్రతిజ్ఞ బూనగను రమ్యశుభోదయవేళ నిప్పుడీ
పండిత బృంద సంయుత సభాస్థలి నిర్మలభావపూతమౌ
నిండు మనంబుతో నిలను నిత్య మనోహరజేసి కావగా
మెండుగ బద్ధకంకణత  మీరలు సంతత సత్యసంధులై.
కం.
ఎటు చూచిన మతమౌఢ్యం
బెటు గన్నను స్వార్థపరత యిలలో నేడున్
పటుతర శాంతి సమీరము
కటకట! కరువయ్యె గాదె కాంచుడు మీరల్.
రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా 
విద్యార్థులనుద్బోధిస్తూ వ్రాసిన పద్యములు
26.01.2002
జ.న.వి.వెన్నెలవలస, శ్రీకాకుళం




No comments:

Post a Comment