Saturday 1 October 2011

మత్స్యోదంతము


మత్స్యోదంతము
(చేపల కథ)
(గద్య కథకు పద్యాను కృతి) 
పూర్వకాలమందు పుష్పక మను చెర్వు
కలదు దానియందు కాలమతియు
సుమతి, మందమతియు సుఖ్యాతనామాల
మత్స్యమిత్రులుండు మైత్రితోడ.

సుమతి సార్థకనామంబు శోభనంబు
అకట! యేదేని యాపద నంది నపుడె
గాంచు సద్భావభాగ్యంబు కాలమతియు
మంద మతియౌర! నిజముగ మందబుద్ధి.

భేదము లేకిక మత్స్యాల్
మోదంబున జేరియుండు ముచ్చట గొల్పన్.
రాదేది వాటి మధ్యను
వాదెప్పుడు జూడ మిగుల వాక్యము లేలా?

అంత నొకపరి వేసవి యెంతొ తీవ్ర
తరముగను గాసె లోకాలు దైన్యపడగ,
చెట్లు చేమలు పైరులు చేవ జచ్చి
కనలిపోవుచునుండ దా గాంచి సుమతి.

తనమిత్రులతో నను దాన్
వినుడో సన్మిత్రులార! వేసవి జూడన్
కనకన నిప్పులు రాల్చుచు
ఘనతాపము గూర్చు చుండె కనుడీ మీరల్.

ఇంతకు మున్నె జాలరులు యిచ్చటికేగిరి వారలొండొరుల్
సంతసమంది పల్కిరిటు చక్కగ చెర్వున నీళ్ళు లేమి తా
మెంతయొ మోదమందుచును నిచ్చటి నీరము కొద్దికాలమం
దింతయు నింకిపోవు నపుడిచ్చట చేపల బట్టగా దగున్.
              కావున
ఇట నుండగ రాదికపై         
నెటులైనను నేగ వలయు నెందేనిపుడే
పటుతరమగు యాలోచన
నటు నిటు యోచించి గనుడు యస్మన్మిత్రుల్.

బాగగు యాలోచన దా
న్సాగెను మన్మదిని యిపుడు శ్రద్ధగ వినుడీ
వేగంబున మనమందర
మాగక యీకాల్వవెంట నఛ్ఛోదంబున్.

ఎట్టులైన గాని నేరీతి నైనను
చేర వెళ్ళ వలయు, వేరు మార్గ
మేది లేదు, వినుడు యింకేది యైనను
తెలియ వచ్చెనేని తెల్పుడనియె.

సుమతి మాటల కెంతయొ చోద్యమంది
కాలమతి యను నేమేమి? బేలవలెను
యింత చింతేల? భయమేల? సుంత వినుమ,
కాంతు మార్గంబు నాపద గల్గెనేని.

మందమతియేమొ మిత్రుల మాటలసలె
విననిదానియు బోలె నేమనదు కనదు
ధరణిని వినాశకాలము దాపురింప
హితుల మాటలు మరియేల మతికి నెక్కు.

వారిద్దరి కృత్యము గని
యారేయినె సుమతి చేరె నచ్ఛోదంబున్
నీరము తా గతియించగ
వారంతట వలలతోడ వచ్చిరి బెస్తల్.

సరసులోని చేపలనరమర లేకుండ
పట్టి విసరినారు గట్టుపైకి
మందమతియు కాలమతియును తటముపై
విసరి వేయ బడిరి వేగిరాన.

కాలమతి యంత శవముగా గదలకుండ
కొంత సేపుండ వారలు గూడ దాని
వదలివేసిరి మృతమని, పిదప తాను
సరసి జేరెను వెనువెంట సంతసాన.

మందమతికేమి తోచక మారుమారు
ఎగిరి పడుచుండ తటముపై మిగుల జూచి
చేత జాలరి యొకరుండు చిదిమి పట్టి
బుట్టలోపల వైచెను దిట్ట యనగ.

భావి కష్టతతిని భావన సేయుచు
కష్టతరణ మపుడె గాంచు సుమతి
సుమతి మాట వినని కుమతియు మందుండు
ప్రాణహీనుడగును బాధపడుచు.




No comments:

Post a Comment