Monday 16 April 2012

చిత్రవ్యాఖ్య-పద్యరచన

ది.16.04.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో ఇవ్వబడిన చిత్రమునకు వ్రాసిన పద్యవ్యాఖ్య
రావణాసురుడంత రౌద్రరూపము దాల్చి
          వానరవీరులన్ వరుసతోడ
చెలరేగి గూల్చగా శ్రీరాముడాతని
          సంహరించగ వేగ సాగుచుండ
గరుడవాహనుడట్లు ఘనఘనాఘనతుల్య!
          భుజముపై గూర్చుండి పోరుమనుచు
హనుమ కోరినయట్టు లావీరు మూపెక్కి
          శరశరాసనమంది యరిని జూచి
త్రిపురసంహారి సాక్షాత్కరించినట్లు
క్రమము దప్పక దశకంఠు గదలనీక
సురలు బారులుదీరి ఖేచరులు జూడ
బాణవర్షంబు గురిపించె బహుళగతుల. 


ది. 17.04.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో ఇవ్వబడిన చిత్రమునకు వ్రాసిన పద్యవ్యాఖ్య

శరము చెలరేగి శ్రవణుని సంహరింప
శబ్దభేదియె రాజుకు శాపమయ్యె,
దశరథుండంత దు:ఖాగ్నితప్తుడగుచు
వాని జేరెను జీవచ్ఛవంబువోలె. 

ది. 18.04.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో ఇవ్వబడిన చిత్రమునకు వ్రాసిన పద్యవ్యాఖ్య 

పాపము చేసినావయిన భానుజ! దాశరథీశరాహతిన్
దీపిలె నీదుదేహమిక, దివ్యత చేకురు శాశ్వతంబుగా
నా పరమాత్ము డీగలుగు నంతట సద్గతు లంత మోక్షమున్
జూపునటంచు వాలికట సోదరుడున్ సతి చేసి రంజలుల్.
   
ది. 24.04.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో ఇవ్వబడిన చిత్రమునకు వ్రాసిన పద్య వ్యాఖ్య 
 
సీ.
ఒకచేత నసిబట్టి సకలారి సంఘాల
          నధిక తేజంబుతో నణచినావు,
ఒకచేత ఘంటంబు(లేఖిని) ఒప్పుగా ధరియించి
          కవివరేణ్యుల మించి ఘనత గాంచి,
ఆముక్తమాల్యదాద్యనుపమకృతులను
          బహు సమర్థతతోడ బలికినావు,
అష్టదిగ్గజములం చలరారు కవులతో
          సాహితీ సభలెన్నొ జరిపినావు
తే.గీ.
"దేశభాషల జూడంగ తెలుగు లెస్స"
యనెడు సూక్తికి సార్థక్యమందజేయు
"సాహితీ సమరాంగణ సార్వభౌమ!
విష్ణుసన్నిభ! నరసింహ కృష్ణరాయ!".


ది. 26.04.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో ఇవ్వబడిన చిత్రమునకు వ్రాసిన పద్య వ్యాఖ్య
చం. 
సురుచిరమై కనుంగవకు సుందరమౌ ఘనమేఘపంక్తియున్
హరిత మనోహరాకృతుల నద్భుతరీతి వెలుంగు వృక్షముల్
సరముల నిండియున్నవిక స్వాదుజలంబులశేష(తీవ)
మాధురీభరితములౌచు చూచుటయె భాగ్యమనందగు దృశ్యరాజమున్.



ది. 26.04.2012 వ తేదీ   శ్రీ శంకరజయన్తి సందర్భంగా శంకరాచార్యుల వారి నుద్దేశిస్తూ శ్రీనేమాని వారి స్ఫూర్తితో
కం. 
శంకాలేశము లేదిక
శంకరులే పరమగురులు సాక్షాచ్ఛివులౌ(శంకరూపుల్)
సంకటహరణ సమర్థుల
కంకితభావంబుతోడ నర్పింతు నుతుల్. 


ది. 27.04.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో ఇవ్వబడిన చిత్రమునకు వ్రాసిన పద్య వ్యాఖ్య
మ.
ఘనుడాదిత్యుడు, పంచభూతములు సాక్ష్యంబౌచు వీక్షించగా
విను సత్యంబిది దాశరాజ! పలుకుల్ వేయేల? "యుద్వాహమున్
మనమందైనను దల్పబోను", కనుకన్ మాన్యన్, సుతారత్నమున్
నను గన్నట్టి మహాత్ముకిమ్ము దయతో నామాటలాలింపుమా!

(మూడు, నాలుగు పాదాలలో చిన్న సవరణతో)
మ.
ఘనుడాదిత్యుడు, పంచభూతములు సాక్ష్యంబౌచు వీక్షించగా
విను సత్యంబిది దాశరాజ! పలుకుల్ వేయేల? "యుద్వాహమం
చనబోనెప్పుడు, దాల్చబోను మదిలో", నార్యన్, సుతారత్నమున్
ననుగన్నట్టి మహానుభావునకు సన్మానంబుగా గూర్చుమా. 
ఆ.వె.
మాట దప్పబోను, మార్తాండ హిమకరుల్
గతులు దప్పవచ్చు గాని యనుచు
స్థిరత బూని నిల్చి దేవవ్రతుడు తాను
ప్రతిన బూనె నంత భళి యనంగ.

 
ది. 28.04.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో ఇవ్వబడిన చిత్రమునకు వ్రాసిన పద్య వ్యాఖ్య
మ. 
క్రూరాత్మా! విను నీకు మూడె(సుఖమందబోవు) క్షితిజన్,             
                                                గొంపోవుచున్నాడవా?
యీ రామామణి లోకమాత, నిలుమా యీరీతి నీధామమున్
చేరంబోగలవా యటంచు మిగులన్ చింతించి వేగంబుగా
వారింపన్ ధృతిబూని దాకె నపుడున్ వానిన్ జటాయుండికన్.
 మ.
దశకంఠుండను, దానవుండ, ఘనుడన్ ధైర్యప్రతాపంబులన్
దిశలెల్లం బరికించి చూచిన నికన్ దీటెవ్వరున్నారు? నీ 
వశమా, నన్నడగించుటంచు కినుకన్ వైచెన్ విహంగాగ్రణిన్
నిశిసంచారుడు నిర్జరారి యసితో నిందాప్రసంగంబులన్. 

ది. 29.04.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో ఇవ్వబడిన చిత్రమునకు వ్రాసిన పద్య వ్యాఖ్య
తక్షకాహి విషపు దావానలంబున
జనకుడంతమౌట వినన మీద
మునుపు చేయుచుండె జనమేజయాఖ్యుండు
సర్పయాగ మచట నేర్పుమీర.

సర్పకులములన్ని సత్వంబు నశియించి
మహితమైన మంత్ర మహిమ వలన
ఒకటి రెండు గాదు  సకలాహిసంఘాలు
వరుసగట్టి యజ్ఞవాటి కపుడు.

చేరి పడుచునుండె నేరుగా హోమాగ్ని
గోరినట్లు వాటి తీరు గనుడు
తక్షకుండు తాను ధైర్యంబు గోల్పోయి
నాకలోక మందు నక్కి యుండె.

సిద్ధ మచట మఘవు సింహాసనంబును
చుట్టి దాగి యుండె, చోద్య మపుడు
యాగశాలలోని యాజ్ఞికవరులంత
"ఇంద్రయుతుడ! వ్యాళ మిలకు రమ్ము".

అనుచు బల్కి వార లాహుతులీయంగ
చిత్రమేమొ గాని సేంద్రుడగుచు
తక్షకుడను పాము ధరణికి నేతెంచి
యాగ వహ్ని లోన వేగ మపుడు.

పడుచు నుండ బోవ పరమదయాళుండు
ఘోర మాప దలచి చేరి నిలిచి
స్వస్తివచనశీలి యాస్తీకు డదిగని
దయను జూపు మనియె ధరణి పతికి. 

సాధువర్తనుండు జనమేజయుండంత
శాంతమూర్తియగుచు శ్రద్ధతోడ
ప్రణతులొసగి యాగ పరిసమాప్తిని జేసె
జగములన్ని మిగుల సంతసించ.  

ది. 01.05.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో ఇవ్వబడిన చిత్రమునకు వ్రాసిన పద్య వ్యాఖ్య
తనయను గాంచుమో యనఘ! తాపససత్తమ! నాకమేగెదన్
మనమలరంగ బెంచుమిక మత్తనుజాతను గాధినందనా!
యని వచియించు మేనకకు నా మునివర్యుడికేమి పల్కకే
తనగతి నేగినాడు భవితవ్యము దేవుని కప్పగించుచున్.  

ది. 11.05.2012 వ తేదీ  
శంకరాభరణం బ్లాగులో ఇవ్వబడిన చిత్రమునకు 
వ్రాసిన పద్య వ్యాఖ్య  
ఆర్యా!
నమస్కారములు, చిత్రంలో ఇద్దరు మహానటులు కనిపిస్తున్నారు.

ఒకరు రంగారావు, మరొకరు రామారావు.
సీ.
అత్యద్భుతంబైన హావభావముతోడ
          పాత్రానుగుణ్యమౌ భాషతోడ,
నటనలో లీనమై నవరసభావాల
          ననయంబు చూపించు ఘనులు వారు,
అభినయోచితమైన ఆహార్యమును దాల్చి
          పాత్రలో జీవించి భవ్యమైన
యశమును సాధించి యఖిలాంధ్ర హృదయాల
          నుఱ్ఱూతలూగించి యున్నవారు
తే.గీ.
రంగరాయుండు, తారక రామరావు
నటుల నుత్తములే కాదు, నవ్యగతులు
నేర్పియుండిరి జగతికి నిష్ఠతోడ
వారి కొసగెద నింక జోహారు లిపుడు. 

ఇక చిత్రంలో ప్రధానంగా కనిపిస్తున్న ఘటోత్కచుడు:
ఉ.
మేటివిరా! భళీ! యపుడు మేలొనరించగబూని యా జగ
న్నాటక సూత్రధారి యదునందను డంప, సుయోధనాదు లా
రాటము చెందుచుండ మధురంబగు రూపము దాల్చి యందు నీ
పాటవ మంత జూపుచు శుభప్రదుడైతివిగా ఘటోత్కచా! 


ది. 12.05.2012 వ తేదీ  
శంకరాభరణం బ్లాగులో ఇవ్వబడిన చిత్రమునకు 
వ్రాసిన పద్య వ్యాఖ్య  

సీ.
గౌతమార్యుని పత్ని యీతన్వి శ్రీరామ!
          జంభారి కల్మషచర్యవలన
భర్తృశాపమునంది పాషాణరూపాన
          జవసత్వములు పోయి చట్టుబడియె
నీపాదధూళిచే నిజరూపమును దాల్చి
          యవనతయై యున్న దంజలించి
మగువగా రాతిని మార్చిన నీకీర్తి
          జగతిలో వెలుగొందు శాశ్వతముగ
ఆ.వె.
అను మౌనివర్యు డా యహల్యను జూపి
రామచంద్రు తోడ రమ్యముగను
పలికి, యామె గాంచి కలకంఠి! శుభములు
గలుగుగాత! యనియె గాధి సుతుడు. 
కం. 
శ్యామా! పరమదయాగుణ
ధామా! రఘువంశసోమ! దశరథరామా!
మా మా సన్నుతులందుచు
కామితములు దీర్చి మమ్ము కాపాడుమయా!

ది. 21.06.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో ఇవ్వబడిన చిత్రమునకు వ్రాసిన పద్య వ్యాఖ్య 
 
 
ఓ కలహంసమా! వినుమ, ఒప్పుగ నేడు మహోపకారమున్
నాకు నొనర్చినావుగద, నన్ను సఖీమణిగా మనంబునన్
జేకొని, నాదు సమ్మతిని చేర్చు నరేంద్రుని కిప్పుడే తగన్
నీకొనరింతు వందనము నీవికఁ జూపుము మాకు సంగతిన్.

ఆ రమణీయరూపసుగుణాన్వితు నా యసమానవిక్రమున్
గోరితి నాథుగా నికను కోరిక దీర్చుము, రాజశేఖరున్
చేరగ బంపు మిచ్చటకు శీఘ్రమె, నాకు స్వయంవరంబు తా
కూరిమి నిండ తండ్రియిదె గూర్చును, రాదగు దానికాతడున్. 


ది. 07.07.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో ఇవ్వబడిన చిత్రమునకు వ్రాసిన పద్య వ్యాఖ్య 

ముసిముసి నగవులతో నీ
పసిబిడ్డ వెలుంగు చుండె భాగ్యాంబుధియై
వసుధన్ యశముల నందుచు
వసియించి సుఖించు గాత! వత్సరశతముల్. 

 ది. 08.07.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో ఇవ్వబడిన చిత్రమునకు వ్రాసిన పద్య వ్యాఖ్య
                

తెల్లని మల్లెలఁ జూచిన
నుల్లంబులు సంతసిల్లి యుత్సాహమగున్
చల్లని సద్భావంబది
యెల్లరకును గలుగుచుండు నిమ్మహిలోనన్.


(13.07.2012)
 

తండ్రి రూపమండ్రు తనయుండు జగతిలో
శ్రద్ధబూను చుండి జనకవరుని
గూడి యందమొప్ప కులవిద్యలనునేర్చు
పుత్రు డెల్లవేళ పొందు యశము. 

 (14.07.2012)
నారాయణ! పీతాంబర!
క్షీరోదధి విశ్రమించు చిన్మయరూపా!
ఈరేడు జగములేలెడు
వీరా! మముగావుమయ్య వేవేలనతుల్.
 
(18.07.2012) 
ఈ సింహాన్ని చూస్తుంటే అది ఇలా అంటున్నట్లుగా భావన కలుగుతున్నది.

భూజనులారా! నావలె
నే జంకును లేక మీర లిమ్మహిలోనన్
రాజిల్లుడు సద్యశ మ
వ్యాజానందమును పొంది యనవరతంబున్.


"యత్ర నార్యస్తు పూజ్యన్తే" అను సంస్కృత శ్లోకానికి తెలుగు అనువాదం. 
శ్రీ నేమాని పండితుల వారి స్ఫూర్తితో
బారులు దీరెద రమరులు
నారిని పూజించు చోట,  నానా సుఖముల్
నారిని అవమానించగ
దూరముగా తొలగిపోవు, దు:ఖము గలుగున్. 


ది.12.06.2012  వ తేదీ  
"శంకరాభరణం" బ్లాగులో ప్రచురించ బడిన 
పెద్దనగారి ఉత్పలమాలికను చూచి స్పందిస్తూ 
వ్రాసిన ఉత్పలమాలిక.

ఆతడు పెద్దనార్యుడిక నాంధ్ర కవిత్వపితామహుండునై
శ్రోతలు, పాఠకుల్, కవులు సుందరమంచు వచించునట్లుగా
కైతలు సంస్కృతాంధ్రములఁ గమ్మగఁ జెప్పి కవీంద్రకోటికిన్
రీతులు నేర్పె నా కవివరేణ్యుడు చూడగ కృష్ణదేవరా
ట్చేతము హర్షదీప్తముగఁ జేయ సుశబ్దసుమాల మాలతోఁ
బ్రీతిగ గండపెండెరము పెద్దవటంచు నృపాలు డంతటన్
జోతలు చేసి పాదమున సుస్మితుడై తొడిగెన్, మహాత్ముడా
తాతకు వందనంబులివె ధన్యుడు సార్థకనామధేయుడున్.

 

No comments:

Post a Comment